వడగాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోతుంది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నెల 15 వరకు వడగాల్పుల తెవ్రత తప్పదని వాతావరణ శాఖా తెలిపింది.నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎక్కువ మండలాలు గాడ్పుల తీవ్రతకు నిప్పులకొలిమిని తలపించాయి. మధ్యాహ్న సమయంలో గాడ్పుల ప్రభావానికి ప్రజలు విలవిల్లాడారు.
గత రెండు వారాలుగా ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు గాడ్పులు కొనసాగడంతో ఆరుబయట పనిచేసేవారు, ప్రయాణాలు చేసేవారు ఠారెత్తిపోయారు. రాత్రి సమయంలో భూమి నుంచి వేడిసెగలు వస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఉత్తరకోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు ఆరు నుంచి తొమ్మిది, కోస్తాలో మిగిలిన చోట్ల నాలుగు నుంచి ఏడు డిగ్రీలు, రాయలసీమలో రెండుమూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.